తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరిస్తే సినిమా వాళ్లకు కష్టాలు ఉండవన్నారు పోసాని కృష్ణమురళి. హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు ఇస్తే.. విశాఖలో స్టూడియోలు ఎందుకని ప్రశ్నిస్తారంటూ కీలక కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు సినిమా నటుల పరిస్థితి అయోమయంగా ఉంది.. ఏపీలో ఉండాలో, తెలంగాణలో ఉండాలని తెలియని తికమకలో ఉన్నారని చెప్పారు ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
సీఎం కేసీఆర్ అంగీకరిస్తే నటుల అయోమయపరిస్థితికి తెరపడుతుందన్నారు పోసాని. సినీ ఇండస్ట్రీ కోసం సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. అనేక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారని గుర్తు చేసిన పోసాని.. ఏపీలో సినిమా షూటింగ్ ఉచితంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. సినిమా స్టూడియోలు కడితే సహకరిస్తామని కూడా సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు పోసాని.
ప్రస్తుతం పద్యనాటకాలకు ఆదరణ తక్కువవుతున్న క్రమంలో వాటిని ప్రోత్సహించేలా సీఎం జగన్ సూచనల మేరకు పద్య నాటకాలకు నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు పోసాని. పద్యనాటకాలు, చిన్న పిల్లల నాటికలు, యూత్.. ఇలా ఐదు విభాగాల్లో అవార్డులు ప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రిలిమినరి రౌండ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా పోటీలు జరుగుతాయని కళాకారుల దగ్గరకే జడ్జిలు వెళ్ళి స్క్రూటిని చేస్తారని చెప్పారు. అయితే, ఒకేసారి అన్ని రంగాలకు(టీవీ, సినిమా, డ్రామా) అవార్డులు ఇవ్వడం వీలుపడదని, ముందుగా పద్య నాటకాలకు అందిస్తామన్నారు. ఆ తరువాత మిగతా రంగాలకు అవార్డుల ప్రదానం ఉంటుందని చెప్పారు పోసాని కృష్ణ మురళి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..