-
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా సాగింది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వైభవంగా సర్కారీ సత్కారాలు అందించారు. వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు తళుక్కుమన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సహా పలువురు ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. టాలీవుడ్లో మళ్లీ సందడి తీసుకొచ్చిన ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో చూద్దాం.
-
ప్రజాగాయకుడు, తెలంగాణ సాయుధపోరాట యోధుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్లో గ్రాండ్గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈవేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీ,నటులతో పాటు టాలీవుడ్కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు.
-
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈవేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురష్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్తో టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది.
-
'పుష్ప 2' చిత్రానికి ది బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. స్టేజీపైకి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని అలింగనం చేసుకొని... సీఎంను రేవంతన్న అంటూ సంబోధించారు. స్టేజ్ పైన మాట్లాడిన అల్లు అర్జున్.. సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకుని.. 'పుష్ప-2' సినిమాలలోని డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచారు.
-
గద్దర్ పురస్కారాల్లో భాగంగా ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. మెమొంటోతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీ, ప్రత్యేక ప్రశంసా పత్రం బాలయ్యకు అందజేశారు. ఈ ప్రైజ్ మనీ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్కు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు. వార్డు తీసుకున్న తర్వాత స్టైల్గా మైక్ గాల్లోకి ఎగరేస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు బాలయ్య.
-
నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డును సీఎం రేవంత్ రెండ్డి అందించారు. సినిమా వాళ్లందర్నీ ఒకదగ్గరికి తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు విజయ్ దేవరకొండ.
-
ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అనే సినిమాకు అందుకున్నారు. ఇక ఉత్తమ డైరెక్టర్ గా నాగ అశ్విన్ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. 2024 చిత్రాలకు సంబంధించి అన్ని విభాగాలకు పురస్కారాలు ఇవ్వగా.. 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు దక్కాయి.
-
ఒక్కో సినిమానికిగానూ నాలుగు పురస్కారాలను అందించారు. ఆయా సినిమాల నిర్మాతలకు బంగారు, డైరెక్టర్లకు సిల్వర్, హీరో- హీరోయిన్లకు బ్రాంజ్ మెమెంటోలను ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్లో జయజయహే గీతాన్ని కీరవాణి లైవ్ లో పర్ఫార్మ్ చేశారు.
-
గద్దర్ అవార్డుల విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇక సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది.