
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. ప్రమాదం కారణంగా మార్క్ శంకర్ కాళ్లకు , చేతులకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇక ఇప్పుడు పవన్ భార్యను, కొడుకుని ఇండియాకు తీసుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో పవన్తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్.. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షంగా బయటపడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్నా. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. రూ. 17లక్షలు అన్నప్రసాదాలు విరాళంగా ఇచ్చారు అన్నా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.