మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. సినీ కార్మికులు, అభిమానులు, జర్నలిస్టులతో పాటు సాధారణ ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం జరిగింది. సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన కార్మికులు, అభిమానులు, సినీ జర్నలిస్టులు పాల్గొని ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం సుమారు 2000 మంది ఈ క్యాంప్లో పాల్గొని క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్యుల సేవలపై ప్రశంసలు కురిపించారు.
వైజాగ్, కరీంనగర్లలో..
‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు నిజంగానే గర్వించే క్షణం. త్వరలోనే కరీంనగర్తో పాటు సుమారు 15 నగరాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానున్నాయి. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలి’ అని నాగబాబు కోరారు. కొద్ది రోజుల క్రితమే ఉచిత క్యాన్సర్ పరీక్షలపై ప్రకటన చేశారు మెగాస్టార్ చిరంజీవి. అదే సమయంలో తాను క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా కొలనోస్కోపీ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు తెలిపారు. కాగా ఈనెల 16న విశాఖపట్నం, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు జరగనున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.