
క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ పదం తీవ్ర ప్రకంపనలు రేపింది. కేరళ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించింది. అయితే.. ఈ కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్పై అధ్యయనం చేసేందుకు జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేయగా.. దాదాపు రెండేళ్లు శ్రమించి.. 295 పేజీలతో కీలక రిపోర్ట్ రూపొందించింది. వీటిలో అత్యంత సున్నితమైన అంశాలతో ఉన్న 63 పేజీలను మినహాయించి మిగిలిన నివేదికను బహిర్గతం చేసింది.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 15మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీని శాసిస్తున్నారని హేమా కమిటీ పేర్కొంది. వీళ్లు చెప్పినట్లే కేరళ సినీ ఇండస్ట్రీ నడుస్తోందని.. వాళ్లకు ఎదురు తిరిగిన వారి జీవితాలు నాశనమైపోయాయని వెల్లడించడం కాక రేపింది. అమ్మాయిలు కమిట్మెంట్కు సిద్ధం కావాల్సిందేనని, లొంగకపోతే సెట్లో రీషూట్ల పేరుతో హింసించేవారని కొందరు నటీమణులు చెప్పినట్లు ప్రకటించింది. హేమ కమిటీ రిపోర్ట్తో పెద్దయెత్తన విమర్శలు రావడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్కు సూపర్స్టార్ మోహన్లాల్తో పాటు పలువురు ప్రముఖులు రాజీనామాలు కూడా చేశారు.
హేమ కమిటీ రిపోర్ట్తో కేరళ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ.. దాదాపు 35 కేసులు నమోదవ్వగా వీటిని దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. అయితే.. ప్రస్తుతం ఈ కేసులన్నింటినీ మూసివేస్తున్నట్లు కేరళ హైకోర్టుకు సిట్ తెలియజేయడం సంచలనంగా మారింది. ఈ కేసుల విచారణలో సాక్ష్యం చెప్పేందుకు బాధితులు, సాక్షులు ముందుకు రావడం లేదని.. అందుకే వాటిని మూసివేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కేరళ కోర్ట్.. ప్రస్తుతానికి ఈ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వాటిని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. మొత్తంగా.. క్యాస్టింగ్ కౌచ్కు సంబంధించిన 35 కేసుల్లో సిట్ ఎంక్వైరీని క్లోజ్ చేయడం కేరళ చిత్రసీమలో చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..