ఆస్కార్ సాధించి భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం బృందానికి మళ్లీ మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డులు ఇచ్చే ‘ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తమ సంస్థలోకి కొత్త సభ్యులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 398 మందిని ఆహ్వానించారు. అందులో ట్రిపుల్ చిత్ర బృందంలో ఆరుగురికి ఆహ్వానం అందింది. నటులు జూ.ఎన్టీఆర్, రామ్చరత్ తేజ్ లతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అయిన సాబు సిరిల్లు ఇందులో ఉన్నారు. అలాగే ప్రముఖ దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్, నిర్మాతలు కరన్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ తదితరులను కూడా అకాడమీ స్వాగతించింది.
ఇక ట్రిపుల్ ఆర్ చిత్ర బృందానికి దక్కిన గౌరవంపై ఆ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అకాడమీ అవార్డుల కోసం మా చిత్ర బృందంలోని ఆరుగురిని సభ్యులుగా ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు. అలాగే జూ.ఎన్టీఆర్, రామ్చరత్ తేజ్,ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ కుమార్ , సాబు సిరిల్ లకు అభినందనలు తెలియజేశారు. అలాగే మిగతా ఇండియన్ సినిమా సభ్యులకు కూడా అభినందనలు చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.