

బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేసి సల్మాన్ను చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి రాకీ భాయ్ అని పేరు పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపు వచ్చిన వెంటనే ముంబై పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ చేసిన రాకీ భాయ్ తాను జోధ్పూర్ నివాసి అని, గోరక్షకుడిని అని పోలీసు కంట్రోల్కి చెప్పాడు. సోమవారం రాత్రి 9 గంటలకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
గత నెలలో కూడా బెదిరింపులు
సల్మాన్ఖాన్కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. గత నెలలో సల్మాన్ ఖాన్కు రెండు సార్లు బెదిరింపులు వచ్చాయి. మార్చి 18, 23 తేదీల్లో మెయిల్ ద్వారా బెదిరించారు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గత నెలలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణ జింక వివాదం కేసులో క్షమాపణలు చెప్పాలని సల్మాన్ ఖాన్ను కోరారు. గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ఖాన్ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు.
బెదిరింపు కేసులో ఓ వ్యక్తి అరెస్టు
గత నెలలో సల్మాన్ను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు, వేగంగా చర్యలు తీసుకున్నారు. ధాకడ్ రామ్ సిహాగ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు మార్చి 18 న సల్మాన్కు వచ్చిన బెదిరింపు వెనుక యుకెలో ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నారని ముంబై పోలీసులు ఇటీవల పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, ముంబై పోలీసులు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకున్నారు. UK ప్రభుత్వానికి అభ్యర్థన లేఖ పంపారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య బయటకు వస్తున్న సల్మాన్ ఖాన్
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తాజా సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ముంబైలో తన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. కొన్ని రోజుల నుంచి సల్మాన్ ఎక్కడికి వెళ్లాలన్నా కట్టుదిట్టమైన భద్రతతో వెళ్తున్నారు. ఫిల్మ్ఫేర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ హాజరయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..