
నటుడు బెనర్జీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులు అలరించారు బెనర్జీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన నట జీవితంలోని అనేక స్మృతులను, తెలుగు సినీ పరిశ్రమలోని సహచరులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సంభాషణలో మెగాస్టార్ చిరంజీవితో తనకున్న సుదీర్ఘమైన, సన్నిహితమైన బంధాన్ని బెనర్జీ ఎంతో ఆత్మీయంగా వివరించారు.
భానుచందర్ తన చిన్ననాటి నుంచి సీనియర్ అని, ఆయన ఆరోగ్య స్పృహ, క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బెనర్జీ తెలిపారు. అలాగే, శరత్ బాబుతో కూడా తమకు మంచి స్నేహం ఉందని, ఆయన మరణించే వరకు ఈ స్నేహం కొనసాగిందని చెప్పారు. తరువాత పూరి జగన్నాథ్, రవితేజలు తాను పరిశ్రమలోకి వచ్చిన తరువాత పరిచయమయ్యారని, అయితే అప్పట్లో సినీ పరిశ్రమలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారని ఆయన గోల్డెన్ డేస్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత తరం యువ నటులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని, వారు అత్యంత వృత్తి నిపుణులు, తమ పని పట్ల పూర్తి అంకితభావంతో ఉన్నారని ప్రశంసించారు.
చిరంజీవితో తనకున్న బంధం గురించి బెనర్జీ మాట్లాడుతూ, చిరంజీవి తన తండ్రి మరణించినప్పుడు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. చిరంజీవిని 1979 నుంచి తనకు తెలుసని, అప్పటి నుంచి ఆయన ఎదుగుదలను దగ్గర నుండి చూశానని చెప్పారు. చిరంజీవి అప్పట్లో టీ నగర్లో క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ గడిపిన రోజుల నుంచి, జయకృష్ణ గారి ఆఫీసులో డేట్స్ కోసం ఎదురుచూసిన సమయాల వరకు బెనర్జీకి బాగా తెలుసు. నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణ వంటి ప్రముఖ నటులు అప్పటికే పరిశ్రమలో ఉన్న సమయంలో, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిరంజీవి పరిశ్రమలోకి వచ్చి, ఎన్నో కష్టాలు పడి, ప్రతి ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు వెదుక్కుని, రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలు చేసి, నిలబడి, మెగాస్టార్ స్థాయికి ఎదిగారని బెనర్జీ అన్నారు. ఆయన ఎంత పెద్ద మెగాస్టార్ అయినా, మొదటి నుంచి తనలో ఉన్న మంచి తనం, నిరాడంబరత ఏ మాత్రం తగ్గలేదని, ఎదురు పడిన వారితో మాట్లాడటంలో ఆయన ఆత్మీయత మారలేదని బెనర్జీ అన్నారు. చిరంజీవి యొక్క గొప్ప గుణాలలో ఒకటి ఆయన సహాయం చేసే స్వభావం అని, ఆయన చేసే పరోపకారాలలో దాదాపు 90 శాతం బయటి ప్రపంచానికి తెలియదని, కేవలం పది శాతం మాత్రమే ప్రజలకు తెలుసని బెనర్జీ అన్నారు. ఎంతో మందికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ఆసుపత్రులలో ఉన్నవారికి అండగా నిలిచారని, వారికి అవసరమైన సహాయం అందిస్తారని ఆయన కొనియాడారు.