Most Recent

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు.. అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం..

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు.. అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం..

బిగ్‌బాస్‌ షో ముగిసినా.. అదిపెట్టిన రచ్చ మాత్రం చల్లారడం లేదు. ఇప్పటికే విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు.. తాజాగా బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్లతో పాటు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై.. వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కాదు బయట కూడా బిగ్‌ డ్రామా నడుస్తోంది. బిగ్‌బాస్‌-7 ఫినాలే సందర్భంగా జరిగిన విధ్వంసం కేసును సీరియస్‌గా తీసుకున్నారు హైదరాబాద్‌ పోలీసులు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఇప్పుడు బిగ్‌బాస్‌ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఆస్తుల ధ్వంసం, అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిగ్‌బాస్‌ షోను ఎండెమోల్‌ షైన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. ఆ సంస్థకే పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్‌ షో జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గర భారీగా అభిమానులు గుమిగూడినా తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 17న బిగ్‌బాస్‌ షో 7 సీజన్‌ విజేతగా పల్లవి ప్రశాంత్‌ను నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రన్నరప్‌గా అమర్‌దీప్‌ నిలిచాడు. షో అనంతరం కంటెస్టెంట్స్‌ బయటకు వచ్చిన సమయంలో విధ్వంస కాండ జరిగింది. కొంతమంది అభిమానులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్‌ వాహనాలను ధ్వంసం చేశారు. ఘటన సమయంలో రాళ్లదాడి జరుగుతుండడంతో అక్కడినుంచి ప్రశాంత్‌ను వెళ్ళిపోవాలని పోలీసులు కోరినా…అతడు వినకపోవడంతో కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌ను A1గా చేర్చిన పోలీసులు.. అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

మరోవైపు బిగ్‌బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలంటూ HRC కి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్. మరోవైపు సీపీఐ సీనియర్‌ నేత నారాయణ కూడా…బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసు పెట్టాల్సింది పల్లవి ప్రశాంత్‌ మీద కాదని, నిర్వాహకుల మీద అన్నారాయన. మరి పోలీసుల నోటీసులకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తం మీద బిగ్‌బాస్‌ షో లోనే కాదు.. బయట కూడా అంతకుమించిన డ్రామా సాగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.