-
మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ సినిమాల్లో బిజీగా కానుంది. అయితే నటిగా కాకుండా నిర్మాతగా తన అభిరుచిని చాటుకునేందుకు రెడీ అయ్యింది. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగాయి.
-
నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు.
-
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పటి వరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలి సారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. తెలియని టెన్షన్గానూ ఉంది. యాదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్, కాన్సెప్ట్తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం' అని చెప్పుకొచ్చింది.
-
'ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం' అని డైరెక్టర్ యదు వంశీ చెప్పుకొచ్చారు.
-
కాగా నిహారిక సినిమా ప్రారంభోత్సవంలో కొత్త దంపతులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు కూడా సందడి చేశారు. అలాగే నాగబాబు దంపతులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.